ములుగు జిల్లా : ఆసియా ఖండంలోనే అత్యధిక భక్తులు హాజరయ్యే అరుదైన జాతర మేడారం జాతర. వన దేవతలైన సమ్మక్క సారలమ్మలు కొలువు తీరిన వీరి త్యాగం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈనెల 28న ప్రారంభమైన మేడారం జాతర జనవరి 30వ తేదీ శుక్రవారం నాటితో ముగుస్తుంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. మేడారం లోని వన దేవతలను దర్శించు కునేందుకు, తమ మొక్కులు తీర్చుకునేందుకు కిలోమీటర్ల పొడవునా బారులు తీరారు. సీఎం అనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. అంతకు ముందు మేడారం జాతరను పురస్కరించుకుని రూ. 100 కోట్లకు పైగా నిధులను మంజూరు చేసింది.
ఇదిలా ఉండగా ఈ మేడారం జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. జంపన్న వాగు జనసంద్రమైంది. భక్త బాంధవులతో మేడారం పులకించి పోయింది. పచ్చని అరణ్యంలో వెలసిన ఆధ్యాత్మిక శక్తి మేడారం. గిరిజన గుండెల్లో వెలిగే భక్తి దీపం సమ్మక్క–సారలమ్మ. శ్రీసమ్మక్క–సారలమ్మ మేడారం మహాజాతర సందర్భంగా ఈరోజు ఉదయాన్నే కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మ వార్లను దర్శించుకున్నారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించి, గిరిజన సంప్రదాయాలకు అనుగుణంగా పూజారులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్నారు.



















