హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. సర్పంచ్ పదవులతో పాటు వార్డు మెంబర్లకు కూడా పోలింగ్ జరుగుతోంది. ఇవాళ ఉదయం 7 గంటలకు అన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో పోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఎలాంటి సంఘటనలు జరగకుండా ఆయా జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఉదయం ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి (1) గంట వరకు కొనసాగుతుంది. పోలింగ్ ఆఫీసర్ పర్యవేక్షణలో గ్రామంలోని అర్హులైన ఓటర్లు తమ ఓటు వేస్తారు. ఇప్పటికే ఓ వైపు చలి వణికిస్తున్నా లెక్క చేయకుండా యువతీ యువకులు, పెద్దలు, స్థానికులు, దివ్యాంగులు, మహిళలు, వృద్దులు సైతం బారులు తీరారు తమ ఓటు హక్కు వినియోగించు కునేందుకు.
ఇక ఎన్నికల విషయానికి వస్తే రాష్ట్రంలోని 193 మండలాల్లోని 3,911 సర్పంచ్ పదవులకు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒంటి గంటకు పోలింగ్ పూర్తయిన వెంటనే బ్యాలెట్ బాక్సులను మధ్యాహ్నం 2 గంటలకు తెరుస్తారు. కౌంటింగ్ ప్రారంభించే ఇదే రోజు విజేతలను ప్రకటిస్తారు. రెండో విడతకు సంబంధించి 3,911 సర్పంచ్ పదవులకు గాను పోటీలో 12,782 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక 29,917 వార్డులకు గాను 71,071 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.
