న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం దేశ రాజధాని న్యూఢిల్లీలో కాలు మోపారు. ఆయన రేపు కూడా ఇండియాలోనే ఉంటారు. తన రాకతో పెద్ద ఎత్తున భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరో వైపు కీలకమైన పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఇక గత కొన్నేళ్లుగా భారత్, రష్యా దేశాల మధ్య విస్తృతమైన సంబంధాలు నెలకొన్నాయి. ఈ మేరకు ఇరు దేశాధినేతల మధ్య స్నేహ పూర్వకమైన వాతావరణం నెలకొంది. దీంతో ఎలాంటి సాయం చేసేందుకైనా రష్యా ఇండియా కోసం వెనుకాడడం లేదు. ఇండియాకు చేరుకున్న పుతిన్ కు ఘన స్వాగతం లభించింది. ఇందులో భాగంగా కీలకమైన 25కి పైగా ఒప్పందాలపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేయనున్నారు.
ఓ వైపు అమెరికా ఆంక్షల మధ్య రష్యా చీఫ్ పుతిన్ ఇండియాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటన ప్రధానంగా రక్షణ, ఇంధనం, వాణిజ్యం, అంతరిక్ష రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. పుతిన్ ఈ సాయంత్రం ఒక ప్రైవేట్ విందు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఇద్దరు నాయకులు రేపు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అధికారికంగా శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఈ పర్యటన సందర్భంగా సంతకం చేసే అవకాశం ఉన్న 25 కి పైగా ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలను రెండు వైపుల అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ ఒప్పందాలు వ్యూహాత్మక, ఆర్థిక , సాంకేతిక రంగాలను కవర్ చేస్తాయి, ఇది ఇటీవలి సంవత్సరాలలో అత్యంత సమగ్రమైన సహకార రౌండ్లలో ఒకటిగా గుర్తించారు.
