మంగళగిరి : తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం దేవాలయాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజకీయాల కోసం బీజేపీని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని విమర్శించాలి అనుకుంటే ఆ స్వేచ్ఛ వారికి ఉందన్నారు.. అది ప్రజాస్వామ్యం వారికి ఇచ్చిన హక్కు. అందులోకి మతాన్ని లాగడం, వ్యక్తులకు, ఒక భాషకు, మతానికి పరిమితం చేయడం సరికాదన్నారు. తమిళనాడులో కొన్ని రాజకీయ పార్టీలు సూడో సెక్యులరిజాన్ని పాటిస్తున్నాయని ఆరోపించారు. హిందూ సమాజపు హక్కును కాపాడేలా ఒక న్యాయమూర్తి తీర్పు ఇస్తే 120 మంది ఎంపీలు అభిశంసన పిటిషన్ వేయడం దారుణమన్నారు.
శబరిమల ఆలయం వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంలో హిందువులు న్యాయ పరంగానే పోరాడారు తప్ప జడ్జిలపై అభిశంసన తీర్మానాలు పెట్టలేదని అన్నారు. ఇటీవల మాజీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హిందువుల మనోభావాలు దెబ్బతినే వ్యాఖ్యలు చేసినా ఆయన స్థానాన్ని గౌరవించి ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడలేదని గుర్తు చేశారు. . సనాతన ధర్మ పరిరక్షణ నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదన్నారు. ప్రతి హిందువు సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని ముసాయిదాలో భగవద్గీత ప్రస్తావన ఉందన్నారు.
