గుంటూరు జిల్లా : రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఎక్కువగా దృష్టి సారించిందని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కీలక మీటింగ్ కు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు, మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి, పల్లా శ్రీనివాస రావు తో పాటు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీకి ఘనమైన వారసత్వం, చరిత్ర ఉందన్నారు నారా లోకేష్. ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ప్రతి కార్యకర్తకు మేలు చేకూర్చేలా పార్టీ అధ్యక్షుడు , ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
ఇందులో భాగంగా పార్టీ పరంగా సభ్యత్వాలను ముమ్మరంగా చేయించడం, పార్టీ పరంగా జాయిన్ అయిన వాళ్లకు, గతంలో పని చేసిన వారికి అండగా ఉండేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు నారా లోకేష్. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భీమా సదుపాయం కల్పించామని తెలిపారు. ఇటీవల అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు భారీ ఎత్తున ఆసరా ఇవ్వడంతో ఆర్థిక సాయం చేయడం జరిగిందని చెప్పారు నారా లోకేష్. దేశంలో ఎక్కడా లేని విధంగా , ఏ పార్టీకి లేనంతమంది తమ పార్టీకి కేడర్ , కార్యకర్తల బలం ఉందన్నారు . నేతలు, కార్యకర్తలు, శ్రేణులు విధిగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
