హైదరాబాద్ : హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సంచలన ప్రకటన చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి సందర్భంగా నగరం విడిచి వెళ్లే నివాసితుల కోసం కీలక సూచనలు చేశారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏపీకి చెందిన వేలాది మంది హైదరాబాద్ లో నివసిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత పెద్ద పండుగ సంక్రాంతి . ఈ సందర్బంగా వారి మెప్పు పొందేందుకు తెలంగాణ సర్కార్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా వారికి వెసులుబాటు కల్పించేందుకు గాను టోల్ గేట్ ఎత్తి వేయాలని , వారికి టోల్ ట్యాక్స్ కట్టకుండా మినహాయింపు ఇవ్వాలని కోరుతూ లేఖ రాసింది కేంద్రానికి. ఇది పెద్ద ఎత్తున రాద్దాంతానికి దారి తీసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు తెలంగాణవాసులు.
ఇదిలా ఉండగా తాజాగా సీపీ ఇళ్లు వదిలి వెళ్లే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినంత పని చేశారు సజ్జనార్. పండుగ సీజన్లో దొంగతనాలను నివారించడానికి ప్రజల సహకారం కావాలని కోరారు. ఈ సందర్బంగా తాళం వేసిన ఇళ్లలో విలువైన వస్తువులను వదిలి వెళ్లవద్దని కోరారు. తమ ఇళ్లకు చాలా రోజుల పాటు తాళం వేసి వెళ్లే ముందు తమ సమీప పోలీస్ స్టేషన్ లేదా బీట్ అధికారికి సమాచారం ఇవ్వాలని వీసీ సజ్జనార్ సూచించారు. పండుగ సీజన్లో చాలా ఇళ్లు ఖాళీగా ఉంటాయని పేర్కొన్నారు. దొంగతనాలను నివారించడానికి సాధారణ గస్తీలో భాగంగా పోలీసు సిబ్బంది అటువంటి ఇళ్లపై నిఘా ఉంచుతారని సజ్జనార్ చెప్పారు. ప్రయాణ సమయంలో నగదు, బంగారం లేదా ఇతర విలువైన వస్తువులను ఇంట్లో వదిలి వెళ్లవద్దని ఆయన పౌరులకు గట్టిగా సలహా ఇచ్చారు, వాటికి బదులుగా బ్యాంక్ లాకర్లు లేదా ఇతర సురక్షితమైన ఏర్పాట్లను ఉపయోగించాలని సిఫార్సు చేశారు.
















