హైదరాబాద్ : బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అని, దాని అస్తిత్వానికి భంగం కలిగిస్తే, లేదా ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని సభా సాక్షిగా హెచ్చరించారు. కార్యకర్తలే పార్టీకి బలం , బలగం అని పేర్కొన్నారు. కొదమ సింహాల్లా కదిలి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ను ప్రజలు నమ్మడం లేదని, బీఆర్ఎస్ పాలనే బాగుందని అంటున్నారని అన్నారు. రెండున్నర ఏళ్లకే ఐదేళ్లు పూర్తయ్యాయని ఎద్దేవా చేశారు. ప్రధానంగా పార్టీ క్యాడర్ ను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు కేసీఆర్. కార్యకర్తలకు నిరంతరం శిక్షణ ఇవ్వాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాంగ్రెస్ పాలనలో రైతులు, అన్ని వర్గాల వారు ఆగమై పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణపై అవాకులు చెవాకులు పేలుతుంటే ఒక్కడు కూడా నోరు మెదపక పోవడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీళ్లంతా దద్దమ్మలని , వీరికి చీము నెత్తురు లేనే లేదన్నారు కేసీఆర్. అందుకే జనం వీళ్లను ఏదో ఒక రోజు ఇంటికి పంపించడం ఖాయమన్నారు. ఎవరైతే పార్టీ కోసం కష్ట పడతారో వారికే టికెట్లు కేటాయిస్తామని ప్రకటించారు అధినేత. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, రాచరిక పాలన సాగుతోందని, పక్కా రియల్ ఎస్టేట్ దందా కొనసాగుతోందని ధ్వజమెత్తారు కేసీఆర్. ఇక ఆరు గ్యారెంటీలు అటకెక్కించారని ఎద్దేవా చేశారు.

















