సికింద్రాబాద్ : ఈ దేశంలో సుపరిపాలన కేవలం భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీలలో ఉన్న నాయకులతో “మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని” నిర్వహించారు. డివిజన్, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న నాయకులందరిని అభినందించారు. రాజకీయ నాయకుడికి గెలవడమే అంతిమ గీటురాయి కావాలని అన్నారు ఈటెల రాజేందర్. సుపరిపాలన, ప్రజలు మెచ్చే పాలన అందించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం అని స్పష్టం చేశారు. మన పరివార క్షేత్రాలు అనేక సమస్యల మీద కొట్లాడుతాయని అన్నారు. కానీ వాటిని పరిష్కరించే సత్తా అధికారంలోకి వస్తేనే ఉంటుందని గుర్తించాలని కుండ బద్దలు కొట్టారు.
అనేక సంవత్సరాల స్వప్నం 370 ఆర్టికల్ రద్దు కేంద్రంలో ప్రభుత్వం ఉండటంవల్లనే సాధ్యమైందని స్పష్టం చేశారు ఈటెల రాజేందర్. రామాలయం కోసం అనేక మంది ప్రాణ త్యాగాలు చేశారని కొనియాడారు. ఈ సందర్బంగా వారికి నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. వేలమంది జైల్లో మగ్గారు. చివరికి అది ఫుల్ ఫిల్ అయింది అంటే కేంద్రంలో మన ప్రభుత్వం ఉండటం వల్లనేనని అన్నారు. అధికారం రాకపోతే మనం గెలిచిన వారి ఇంటి ముందు కాపలా కాయాల్సిందేనని, ఆ దుస్తితి రాకుండా ఉండాలంటే మనందరం కలిసి కట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. మస్కా కొట్టి పని చేయించుకునే పరిస్థితి పోవాలంటే మనం తప్పకుండా విజయం సాధించాలని పిలుపునిచ్చారు.

















