హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు పనులు చేశాడంటూ ఆరోపించారు. ఆదివారం మేడ్చెల్ జిల్లాలో పర్యటించారు కవిత. మల్లారెడ్డి వల్ల పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. మేడ్చల్ లో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని అన్నారు.
కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమైనా జరిగింది అంటే డంప్ యార్డ్ సమస్య కొంత తీరిందన్నారు. కానీ శాశ్వతంగా సమస్యకు పరిష్కారం జరగలేదని మండిపడ్డారు.
కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్లీ ఆ సమస్య డబుల్, త్రిబుల్ అయ్యిందంటూ ధ్వజమెత్తారు కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ హయాంలో కొన్ని పెన్షన్లు వచ్చాయి అంతే, కానీ అంతకు మించి అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు . వారి కాలేజిలు, యూనివర్సిటీలు తప్ప ప్రజలు మాత్రం ఏమీ బాగుపడలేదని అన్నారు. విచిత్రం ఏమిటంటే కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన మల్లారెడ్డి కనీసం కార్మికులకు రక్షణ కల్పించలేక పోయాడని మండిపడ్డారు. కాగా తాజాగా కవిత చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి పార్టీ వర్గాలలో.
