వరంగల్ జిల్లా : తాను పదవుల కోసమే పార్టీలు మారుతున్నానంటూ సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరికి రాజకీయ విలువలు లేవో జనానికి తెలుసన్నారు. చిల్లర రాజకీయాలు చేసినందుకే జనం తనను ఛీ కొట్టారని, ఆ విషయం తెలుసు కోకుండా తనపై లేని పోని ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఎవరు ఏమిటనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. అంతే కాదు ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు కడియం శ్రీహరి.
దయాకర్ రావు వ్యక్తిత్వం ఏమిటో సీఎం అనుముల రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టి రానివ్వ లేదన్నారు.
స్టేషన్ ఘనపూర్ కి బైపోల్ వస్తే తాటికొండ రాజయ్యకు టికెట్ దక్కకుండా ఎర్రబెల్లి, పోచంపల్లి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేను దయాకర్ రావు కేసీఆర్ కి అమ్మాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు కడియం శ్రీహరి. మనవరాలి వయసులో ఉన్న యువతి చేతిలో ఓడిపోయినా ఆయనకు బుద్ధి రాలేదంటూ భగ్గుమన్నారు. ఇక నుంచి తన పట్ల నోరు పారేసుకుంటే తాను ఊరుకునేది లేదన్నారు.

















