Minister Savitha : విజయవాడ :కల్తీ మద్యం తయారీ, అమ్మకాల్లో జోగి రమేష్ అరెస్టయినప్పుడు బీసీలు గుర్తుకొచ్చారా.. మీ పాలనలో వెనుకబడిన తరగతులపై తప్పుడు కేసులు బనాయించి, అక్రమ అరెస్టులు చేసినప్పుడు ఏమైంది నీ మొసలి కన్నీరు..? అంటూ జగన్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత (Minister Savitha) ప్రశ్నించారు. నా బీసీలంటూ ఓట్లు వేయించుకుని, అయిదేళ్ల పాటు అన్ని విధాలా వెనుబడిన వర్గాలను అణగదొక్కిన ప్రబుద్ధుడు జగన్ అని మండిపడ్డారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యమిస్తోందని, దీనిలో భాగంగానే రూ.1000 కోట్లతో ఆదరణ 3.0 పథకాన్ని శ్రీకారం చుట్టామన్నారు. ఈ పథకం కింద కుల, చేతి వృత్తులవారికి ఆధునిక పరికరాలు అందజేసి, వారికి శాశ్వత ఉపాధి కల్పించనున్నామని సవిత వెల్లడించారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్ లో నిర్వహిస్తున్న బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల వర్క్ షాప్ ముగింపు సమావేశంలో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు.
Minister Savitha Slams YS Jagan
ఆది నుంచి బీసీల సంక్షేమానికి టీడీపీ ఆవిరళ కృషి చేస్తోందన్నారు. ఆనాడు అన్న ఎన్టీఆర్, నేడు సీఎం చంద్రబాబు బీసీల సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోగాని, విభజిత ఏపీలో గాని ఎన్నడూ లేని విధంగా బీసీల అభ్యున్నతికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో రూ.47,456 కోట్లు కేటాయించారన్నారు. ఇదొక చరిత్రన్నారు. బీసీ విద్యార్థుల విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, బీసీ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందజేస్తున్నామని తెలిపారు. గతంలో ఆదరణ 1.0, ఆదరణ 2.0 పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మరోసారి ఆదరణ 3.0 పథకాన్ని ప్రారంభించడానికి చర్యలు ప్రారంభించారని, ఇందుకోసం రూ.1000 కోట్లు కేటాయించారని వెల్లడించారు. ఆదరణ 3.0 పథకంలో భాగంగా కుల, చేతివృత్తుల వారికి ఆధునిక పరికరాలు అందివ్వనున్నట్లు వెల్లడించారు. ఏయే వృత్తుల వారికి ఎటువంటి పరికరాలు కావాలో తెలుసు కోవడమే ఈ వర్క్ షాపు ప్రధాన ఉద్దేశమన్నారు.
Also Read : Hydraa Shocking : కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం జనం సంతోషం
