అమరావతి : రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. మంగళవారం అమరావతి లోని సచివాలయంలో నీటి పారుదల శాఖ, జల వనరుల ప్రాజెక్టులపై కీలక సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా త్వరితగతిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గోదావరి డెల్టా ముంపు, ఇరిగేషన్ సమస్యల పై ప్రధానంగా ప్రస్తావించారు. ఈ కీలక మీటంగ్ కు ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తి, గోదావరి డెల్టా సిస్టమ్ సిఈ, ఎస్ఈ, ఈఈలు, ఏజెన్సీ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందులో భాగంగా గోదావరి డెల్టా లైడార్ సర్వే కోసం 13.4 కోట్లు మంజూరు చేశామన్నారు.
ఈ డిసెంబర్ కు గోదావరి జిల్లాల్లో ముంపు సమస్య , లాకులు, గేట్లు మరమ్మత్తు లకు సమగ్ర డిపిఆర్ తయారు చేయాలని ఏజెన్సీ ని ఆదేశించారు మంత్రి నిమ్మల రామా నాయుడు. 150 ఏళ్ళలో ఎప్పుడూ జరగనంత నష్టం గోదావరి డెల్టాకు జగన్ హాయాంలో జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ గోదావరి డెల్టా ఆధునీకరణ పనులు అర్దాంతరంగా నిలిపేసి, డెల్టా ఆధునీకరణకు సైంధవుడిలా అడ్డుపడ్డాడని మండిపడ్డారు. నిధులున్నా కాలువలు, డ్రైన్లలో తట్ట మట్టి తీయక పోగా, లాకులు, షట్టర్లకు కనీసం గ్రీజు పెట్టడానికి ఒక్క రూపాయి కూడా కేటాయించ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ కు కొత్త గేట్లు ఏర్పాటు చేయడానికి సిఎం చంద్రబాబు రూ.150 కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు నిమ్మల రామా నాయుడు.

















