హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యా వ్యాపారంగా మారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మంగళవారం జరిగిన ఓ సమావేశంలో ప్రసంగిస్తూ నిప్పులు చెరిగారు. ప్రస్తుతం కాంగ్రెస్ కేబినెట్ లో స్వయంగా విద్యా రంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. నిన్నటి దాకా సీఎంను పొగుడుతూ వచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నట్టుండి యూ టర్న్ తీసుకున్నారు. తన శాఖనే టార్గెట్ చేయడం విస్తు పోయేలా చేసింది. ప్రధానంగా ఆయన రాష్ట్రంలో స్కూల్స్, కాలేజీల పరిస్థితిపై స్పందించారు. వీటిని నిర్వహిస్తున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలను ఏకి పారేశారు. వీరంతా విద్య అభివృద్ది కోసం పని చేయడం లేదన్నారు. కేవలం విద్యను అమ్ముకుంటున్నారని, కోట్లు గడిస్తున్నారంటూ బాంబు పేల్చారు.
విచిత్రం ఏమిటంటే నారాయణ విద్యా సంస్థలకు చైర్మన్ గా ఉన్నారు ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ. భారీ ఎత్తున అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని, ఒక రకంగా చెప్పాలంటే దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను గనుక విద్యా శాఖ మంత్రిని అయితే పూర్తిగా విద్యా వ్యవస్థను మార్చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి. ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో.. నారాయణ కాలేజీల్లో డిగ్రీ చేసిన వారే టీచర్లుగా ఉంటారని అన్నారు. ఏ ఉద్యోగాలు రాని వారు గవర్నమెంట్, నారాయణ కాలేజీల్లో లెక్చరర్లుగా పని చేస్తున్నారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

















