హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2047ను ఈనెల 8,9వ తేదీలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. 6వ తేదీ లోపు విజన్ డాక్యుమెంట్ పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ రైజింగ్–2047 విజన రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి స్పష్టమైన దిశను సూచిస్తోందన్నారు సీఎం. ప్రణాళిక బద్ధమైన అర్బన్ ఎకానమీ, రీజనల్ రింగ్ రోడ్లు, కొత్త ఎయిర్పోర్టులు, హైవే–పోర్ట్ కనెక్టివిటీ, గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించే విధానాలతో రూపొందించారు. తెలంగాణను అభివృద్ధి చెందిన దేశాలు, ప్రపంచ నగరాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికలో తెలంగాణ చేనేతకు ప్రతీకగా నిలిచే పోచంపల్లి కళాత్మకతను ప్రత్యేకంగా ప్రదర్శించినందుకు ముఖ్యమంత్రికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. అంతర్జాతీయ వేదికపై నిలబెట్టే ఈ నిర్ణయం రాష్ట్ర సాంస్కృతిక గౌరవానికి మరో ముఖ్యమైన గుర్తింపుగా పేర్కొన్నారు. తెలంగాణను “CURE–PURE–RARE” మోడల్తో 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు.















