అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది మిర్చి , పామాయిల్ పంటల ధరలు ఆశాజనకంగా, రైతులకు లాభదాయకంగా కొనసాగుతున్నాయని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గత సంవత్సరం మిర్చి ధరలు తీవ్రంగా పడి పోవడంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మార్కెట్ జోక్య ధరను ప్రకటించి ధరను స్థిరీకరించిందని గుర్తు చేశారు. అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మంత్రి స్పష్టం చేశారు. గత ఏడాది ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రైతులు పంటల వైవిధ్యీకరణ చేపట్టడం, అలాగే కూటమి ప్రభుత్వం తీసుకున్న సమయోచిత విధాన నిర్ణయాల ఫలితంగా ఈ ఏడాది మిర్చి ధరలు నిలకడగా పెరుగుతున్నాయని చెప్పారు.
ప్రస్తుతం మార్కెట్లో ధరలు బాగుండటంతో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. అవసరమైన సందర్భాల్లో మాత్రమే ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుంటుందని, అనవసరంగా మార్కెట్ను గందరగోళానికి గురిచేసే విధానాలు కూటమి ప్రభుత్వానికి లేవని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో మిర్చి సాగు ముఖ్యంగా పల్నాడు, కర్నూలు, ప్రకాశం, అనంతపురం, ఎన్టీఆర్, నంద్యాల, గుంటూరు, బాపట్ల జిల్లాలలో విస్తృతంగా సాగుతోందని మంత్రి తెలిపారు. 2024–25లో సుమారు 1.96 లక్షల హెక్టార్లలో సాగు జరగగా, 2025–26 ఖరీఫ్లో 2.67 లక్షల ఎకరాల్లో మిర్చి నాట్లు సాగుతున్నాయని చెప్పారు.

















