Minister Atchannaidu : అమరావతి : ఏపీకి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం కేటాయించినట్లు వెల్లడించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). కృష్ణపట్నం పోర్ట్ ద్వారా 11,605, కాకినాడ పోర్ట్ ద్వారా 18,765 , మంగళూరు పోర్ట్ ద్వారా 2700, జైగడ్ పోర్ట్ ద్వారా 8100 మెట్రిక్ టన్నుల యూరియా ఈనెల 18 లోపు రాష్ట్రానికి చేరుకుంటుందని వెల్లడించారు. అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. కేంద్రం పలు రాష్ట్రాలకు యూరియాను కేటాయించిన సందర్భంగా రాష్ట్రానికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చిందని, ఈసందర్భంగా కేంద్రానికి , పీఎం మోదీకి, సంబంధిత శాఖ మంత్రికి , ప్రయత్నం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.
Minister Atchannaidu Key Comments Urea
ఈ కేటాయింపుతో రైతులకు వెసులుబాటు లభిస్తుందని చెప్పారు అచ్చెన్నాయుడు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని, రాష్ట్రంలో ఇప్పటికే సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ రాష్ట్రానికి అధిక మొత్తంలో యూరియాను కేటాయించేలా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
వైసీపీ కావాలనే యూరియా సరఫరాపై అబద్ధాలు ప్రచారం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. రైతులను భయపెట్టి రాజకీయ లాభాలు పొందాలన్న ప్రయత్నం విజయవంతం కాదని ఆయన హితవు పలికారు. రైతు సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అన్ని విధాల కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. వైసీపీ నేతలు రైతుల సమస్యలపై కన్నెత్తి చూడరని, నేడు తప్పుడు ప్రచారాలతో రైతాంగాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read : PCB Shocking Demand : ఆసియా కప్ వివాదం: మ్యాచ్ రిఫరీ తొలగింపుపై పీసీబీ డిమాండ్
