హైదరాబాద్ : వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా శుక్రవారం వాతావరణ శాఖ పలు జిల్లాలకు ‘పసుపు హెచ్చరిక’ (Yellow Alert) జారీ చేసింది; గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ వర్షాలతో పాటు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
శుక్రవారం నాడు ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం నాడు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల మరియు జనగాం జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ. ఆదివారం నాటికి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి , జనగాం వంటి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు ‘పసుపు హెచ్చరిక’ జారీ చేసిన వాతావరణ శాఖ, బలమైన గాలులు , మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
















