హైదరాబాద్ : హైడ్రా దెబ్బకు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. హైదరాబాద్ లోని పాతబస్తీలో ఉన్న బుమ్రుక్న్-ఉద్-దౌలా సరస్సును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. ఆయన సరస్సు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్తో పాటు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సందర్శకుల రద్దీ కారణంగా కొన్ని ప్రాంతాల్లో పచ్చదనం దెబ్బ తినడాన్ని వారు గమనించారు. సాయంత్రం వేళ వాకింగ్కు వచ్చిన వందలాది మంది ప్రజలు కమిషనర్ను కలిశారు. నిజాం కాలం నాటి ఈ చారిత్రక సరస్సు పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అభివృద్ధిని వారు అభినందించారు. ఇది ఇప్పుడు అందరికీ ఒక పర్యాటక ప్రాంతంగా మారిందని వారు పేర్కొన్నారు. సందర్శకుల రద్దీ వల్ల సరస్సు చుట్టూ ఉన్న పచ్చదనం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని వారు కమిషనర్ను కోరారు. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తోందని కమిషనర్ వారికి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ చేసిన పలు సూచనలను ఆయన స్థానికులతో పంచుకున్నారు. సరస్సు పరిరక్షణలో స్థానికులు కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వం ఆశిస్తోందని ఆయన తెలిపారు. ఇందుకోసం స్థానికులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని వారికి చెప్పారు. అలాగే, ఇక్కడ అదుపులేని గుంపులు గుమి గూడుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో, కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని స్థానిక పోలీసులను కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. రోజువారీ టిక్కెట్లతో పాటు నెలవారీ , వార్షిక పాస్లను ప్రవేశపెట్టడం సరస్సు నిర్వహణకు సహాయ పడుతుందని పలువురు స్థానికులు ఈ సందర్భంగా సూచించారు. దీనివల్ల అదుపులేని గుంపుల సమస్య కూడా తగ్గుతుందని చాలామంది అభిప్రాయపడ్డారు. సరస్సు పరిరక్షణలో ప్రభుత్వ శాఖలకు పూర్తి సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు.
