అమరావతి : రాష్ట్రంలోని దేవాలయాలలో వసతి కల్పన, నిర్మాణాలకు సంబంధించి తక్షణమే మాస్టర్ ప్లాన్ లు తయారు చేయాలని ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. భక్తులకు మెరుగైన సదుపాయాలు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, నివాస సౌకర్యాలు, పరిశుభ్రత వంటి అంశాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నారు. దేవాలయాల్లో పవిత్రతో పాటు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దేవుణ్ణి దర్శించు కోవడానికి వచ్చే భక్తులు భక్తి భావంతో దర్శనం చేసుకునే వాతావరణం ఉండేలా చేయడంతో పాటు.. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే భక్తులు సంతృప్తితో తిరిగి వెళ్తారన్నారు. గతంతో పోల్చుకుంటే రాష్ట్రంలోని దేవాలయాలకు భక్తుల సందర్శన పెద్ద ఎత్తున పెరుగుతోందన్నారు.
ప్రధాన దేవాలయాల్లో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. 2025-26 సంవత్సరంలో శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో 1.20 కోట్లకు పైగా భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. శ్రీకాళహస్తిలో 83.88 లక్షలు, సింహాచలంలో 65.48 లక్షలు, అన్నవరంలో 57.87 లక్షలు, ద్వారకా తిరుమలకు 55.15 లక్షల మంది భక్తులు సందర్శించారని వెల్లడించారు సీఎం. దేవాలయాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత దేవాదాయ శాఖపైనే ఉందని స్పష్టం చేశారు. భక్తులకు తాగు నీటి సౌకర్యం మొదలుకుని అన్నదానం వరకు అన్ని రకాల సేవలను అందించాలని అన్నారు.



















