అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఏపీ అన్ని రంగాలలో ముందంజలో కొనసాగుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఇంధన పరివర్తన అద్భుతమైన వేగాన్ని పుంజుకుంటోందని అన్నారు. కర్నూలు , అనంతపురం జిల్లాలలో టాటా పవర్ రెన్యూవబుల్స్ తన రూ. 5,750 కోట్ల విలువ చేసే 800 మెగావాట్ల హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ దీనిని ప్రారంభించడం తను జీవితంలో మరిచి పోలేనని పేర్కొన్నారు. 400 మెగావాట్ల సౌర విద్యుత్ , 400 మెగావాట్ల పవన విద్యుత్తో ఈ ప్రాజెక్ట్ సుమారు 4,000 మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తనను గణనీయంగా బలోపేతం చేస్తుందని చెప్పారు నారా లోకేష్.
ఈ ప్రాజెక్టుకు అవసరమైన పవన టర్బైన్లను ఆంధ్రప్రదేశ్లోని తన తయారీ కేంద్రం నుండి సుజ్లాన్ సరఫరా చేయనుండటం కూడా నాకు అంతే సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. ఇది కేవలం పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా, రాష్ట్రంలో ఒక సంపూర్ణ స్వచ్ఛ ఇంధన తయారీ పర్యావరణ వ్యవస్థను నిర్మించాలన్న మా దార్శనికతకు ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుందన్నారు.
మా సమీకృత స్వచ్ఛ ఇంధన విధానం భారతదేశంలోని అత్యుత్తమ కంపెనీలను ఆంధ్రప్రదేశ్కు ఆకర్షిస్తోందని పేర్కొన్నారు నారా లోకేష్. మనమందరం కలిసి ఉద్యోగాలను సృష్టిస్తూ, తయారీ రంగాన్ని బలోపేతం చేస్తూ మన రాష్ట్రానికి , దేశానికి మరింత పచ్చని, సుసంపన్నమైన భవిష్యత్తును నిర్మిస్తున్నామని అన్నారు.
















