మ‌హారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కూట‌మి హ‌వా

17 స్థానాల‌కు గాను 16 సీట్లు కైవ‌సం

hellotelugu-MaharashtraMLC

ముంబై : మహారాష్ట్ర శాస‌న మండ‌లి ఎన్నికల్లో 17 స్థానాలకు గాను 16 గెలుచుకుంది కూటమి. జూన్ 18న 17 స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే, ఓటింగ్ జరగకముందే ఆరుగురు మహాయుతి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడంతో కూటమికి ముందస్తు ఆధిక్యం లభించింది. భారతీయ జనతా పార్టీ అత్యధికంగా 11 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద విజేతగా నిలవగా, శివసేన (షిండే వర్గం) మూడు స్థానాలను, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) రెండు స్థానాలను దక్కించుకున్నాయి. అధికారిక మహాయుతి అభ్యర్థికి దక్కని ఏకైక స్థానం నాసిక్. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి , బీజేపీ రెబల్ నేత గోకుల్ గితే, శివసేన అభ్యర్థి నరేంద్ర దరాడేను ఓడించారు. ఈ నియోజకవర్గంలో గితే విజయం శివసేనకు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించ బడుతోంది. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో శివసేన నుండి రవీంద్ర ఫటక్ (థానే), దుష్యంత్ చతుర్వేది (యావత్మాల్); ఎన్‌సీపీ నుండి అనికేత్ తట్కరే (రాయ్‌గఢ్-రత్నగిరి-సింధుదుర్గ్), విక్రమ్ కాకడే (పూణే); అలాగే బీజేపీ నుండి అరుణ్ లఖానీ (వార్ధా-చంద్రపూర్-గడ్చిరోలి), ప్రజక్త్ తన్‌పురే (అహల్యానగర్) ఉన్నారు.

విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులలో సుహాస్ షిర్షాత్ (ఛత్రపతి సంభాజీనగర్-జల్నా), అవినాష్ బ్రహ్మంకర్ (భండారా-గోండియా), ధైర్యశీల్ కదం (సాంగ్లీ-సతారా), రాజేంద్ర రౌత్ (సోలాపూర్), బసవరాజ్ పాటిల్ (ధారాశివ్-లాతూర్-బీడ్), రాజీవ్ పోత్దార్ (నాగపూర్), నందకిషోర్ మహాజన్ (జల్గావ్), ప్రవీణ్ పోటే (అమరావతి) , అమర్ రాజూర్కర్ (నాందేడ్) ఉన్నారు. పర్భనీ-హింగోలి నియోజకవర్గం నుండి శివసేనకు చెందిన సయ్యద్ ఖాన్ విజయం సాధించారు. ఈ ఫలితాలు మహారాష్ట్రలోని స్థానిక స్వపరిపాలన సంస్థలలో ‘మహాయుతి’ (కూటమి) స్థానాన్ని మరింత బలోపేతం చేశాయి. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల పోరుకు ముందు అధికార కూటమికి ఇది ఒక పెద్ద రాజకీయ బలంగా పరిగణించ బడుతోంది.

Exit mobile version