తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రాత్రి స్వామి వారు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. 7 గంటలకు సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
నవాహ్నిక బ్రహ్మూత్సవాల్లో గరుడసేవ ముఖ్యమైనది. గరుత్మంతుడే శ్రీమహా విష్ణువుకు నిత్య వాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండ రామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, జెఈఓ వి. వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న , సూపరింటెండెంట్ ముని శంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
ఇదిలా ఉండగా టీటీడీ ఆద్వర్యంలోని ఆలయాలలో నిత్య అన్నదానం జరిగేలా చూడాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీ పాలక మండలిపై ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్కరు నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని పేర్కొన్నారు.



















