కేరళ : మద్యం అమ్మకాలలో కేరళ రాష్ట్రంలో రికార్డు నమోదు చేసింది . ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఓనం పండుగ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. దీంతో మందుబాబులు దుమ్ము రేపుతున్నారు. తాగేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. ఎగబడి కొనుగోలు చేస్తున్నారు మద్యం బాటిళ్లను. కేవలం 8 రోజుల్లోనే రూ. 700 కోట్లు విక్రయాలు దాటడం విస్తు పోయేలా చేసింది. ఇదిలా ఉండగా గత ఏడాది ఇదే ఓనం సీజన్లో రూ. 694.96 కోట్ల విలువైన మద్యం అమ్ముడైందని అధికారులు తెలిపారు. ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రకారం 10 రోజుల ఓనం పండుగ సీజన్లో మొదటి ఎనిమిది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేరళ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ అవుట్లెట్ల ద్వారా రూ. 771.29 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. కేరళలో పండుగ సీజన్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘బెవకో’ కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది.
10 రోజుల ఓనం సీజన్లో మొదటి ఎనిమిది రోజుల్లోనే మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో రూ. 770 కోట్లకు చేరాయి. ఓనం సీజన్ ప్రారంభమైన ఎనిమిది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెవకో అవుట్లెట్ల ద్వారా రూ. 771.29 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్లు తెలిపారు. ఇది మరికొంత పెరిగే ఛాన్స్ ఉందన్నారు. తిరువోణం పండుగకు ముందు రోజు అయిన ‘ఉత్రాడం’ నాడు బెవకో అవుట్లెట్ల ద్వారా రూ. 126.31 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. ఇది గత ఏడాది ఇదే రోజున నమోదైన రూ. 137.64 కోట్ల అమ్మకాలతో పోలిస్తే తక్కువ అని తెలిపారు. 2025లో ఓనం సీజన్ సమయంలో బెవకో రూ. 826.38 కోట్ల మద్యం అమ్మకాలను నమోదు చేసింది, ఈ ఏడాది అమ్మకాలు ఆ సంఖ్యను మించుతాయని అంచనా వేస్తున్నారు. బెవకో అనేది కేరళ ప్రభుత్వానికి పూర్తిగా చెందిన సంస్థ; రాష్ట్రంలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ , బీర్, వైన్, ఫారిన్ మేడ్ ఫారిన్ లిక్కర్ , ఫారిన్ మేడ్ వైన్ కొనుగోలు , అమ్మకం, పంపిణీ బాధ్యతలను ప్రభుత్వం ఈ సంస్థకు అప్పగించింది.


















