హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కుల గణన సర్వే నివేదిక వెల్లడైంది. ఇందులో విస్తు పోయే వాస్తవాలు వెలుగు చూశాయి. అత్యధిక జనాభా పూర్తిగా వెనుకబడిన, బహుజన సామాజిక వర్గాలకు చెందిన వారే ఉన్నారు. వీరిలో అత్యధికంగా యాదవులు, ముదిరాజులు, మాదిగలు ఉన్నారు. కానీ తక్కువ శాతం ఉన్న రెడ్డి సామాజిక చెందిన వారు కీలకమైన పదవుల్లో ఉన్నారు. ఇక తాజా సర్వే లో సంచలన విషయం వెలుగు చూసింది. తెలంగాణలో 89,000 మంది బాల కార్మికులు ఉన్నారని తేల్చింది. వీరిలో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన చిన్నారులే ఉండడం విస్తు పోయేలా చేసింది.
ఈ 89 వేల మంది బాల కార్మికులలో 14 శాతం మంది ఎస్సీ మాదిగలకు, 11 శాతం మంది ఎస్టీ లంబాడీలకు చెందిన వారున్నారు. రోజువారీ కూలీ పనులలో నిమగ్నమై ఉన్న కులాలలో ఈ రెండు వర్గాలే అత్యధిక వాటాను కలిగి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లలోపు వయస్సు గల దాదాపు 89,000 మంది పిల్లలు రోజువారీ కూలీ పనులలో నిమగ్నమై ఉన్నట్లు తేలింది. తెలంగాణలో, 18 ఏళ్లలోపు వారిలో సుమారు ఒక శాతం మంది రోజువారీ కూలీ పనులలో నిమగ్నమై ఉన్నట్లు గుర్తించారు. ఎస్టీ కి సంబంధించి అత్యధికంగా 7.2 శాతంగా నమోదైంది. ఇది ఆ వర్గాల్లో నెలకొన్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను, అలాగే విద్య , సంక్షేమ మద్దతు వంటి రక్షణ వ్యవస్థలకు వారికి ఉన్న పరిమిత ప్రాప్యతను స్పష్టం చేస్తోంది అని ఆ నివేదిక పేర్కొంది.


















