బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నా, బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధిగా తాను పని చేస్తూ వచ్చానని అన్నారు. ఇదే సమయంలో ఇప్పుడున్న పరిస్థితులలో నెట్టుకు రావడం అనేది ఇబ్బందిగా మారిందని ఆవేదన చెందారు. ప్రత్యేకంగా రాజకీయ రంగం పూర్తిగా భ్రష్టుపట్టి పోయినందని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం. ఈ సందర్బంగా సంచలన ప్రకటన చేశారు సిద్దరామయ్య. తాను రాబోయే 2028 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనంటూ ప్రకటించారు. అందరినీ ఆశ్చర్యపోయేలా చేశారు. అయినప్పటికీ, రాజకీయాల్లో చురుకుగా ఉంటూనే ప్రజల కష్టసుఖాలకు గొంతుకగా నిలుస్తానని స్పష్టం చేశారు. తనను నమ్ముకున్న వారికి న్యాయం చేసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు.
వరుణ నియోజకవర్గ ప్రజలు నన్ను మరోసారి ఎన్నికల్లో పోటీ చేయమని కోరుతున్నారు. కానీ ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని నేను నిర్ణయించుకున్నానని తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ చెప్పారు సిద్దరామయ్య. గతంలో నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, నియోజకవర్గ ప్రజలే మాకు డబ్బు సమకూర్చి మా విజయాన్ని ఖాయం చేసేవారన్నారు. కానీ నేడు అటువంటి పరిస్థితి లేదని వాపోయారు. నాకు ఇప్పుడు 79 ఏళ్లు. మా ప్రభుత్వ పదవీకాలం ఇంకా ఏడాదిన్నర మిగిలి ఉంది. అప్పటికి నాకు 82 ఏళ్లు నిండుతాయి. నా ఆరోగ్యం గతంలో ఉన్నంత దృఢంగా లేదన్నారు. పూర్వంలా ఉత్సాహంతో పనిచేయడం ఇక సాధ్యం కాదని స్పష్టం చేశారు.
2028 నాటికి నాకు 82 ఏళ్లు వస్తాయి. అప్పటికి నా రాజకీయ జీవితం 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. నేను 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను. నేను ఓటములను, విజయాలను రెండింటినీ చూశాను. కానీ నేను నమ్మిన సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించక పోవడం, నా అంతరాత్మకు ద్రోహం చేయక పోవడం నాకు సంతృప్తిని ఇస్తుందన్నారు సిద్దరామయ్య. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజలకు డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నేడు రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయి. నిజాయితీతో కూడిన రాజకీయాలకు విలువ లేకుండా పోయిందన్నారు. ఈ నేపథ్యంలో తాను భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
