బెంగళూరు : గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యంలో భారీ ఖర్చుతో తీసిన టాక్సిక్ మూవీ ఎట్టకేలకు ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి రోజే ఏకంగా వరల్డ్ వైడ్ గా రూ. 120 కోట్లు వసూలు చేసింది. ఇది ఓ రికార్డ్ అని చెప్పక తప్పదు. అయితే ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా నెగటివ్ ప్రచారం ఎక్కువగా ఉండడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు కన్నడ ఫ్యాన్స్. ప్రస్తుతం తెలుగు వర్సెస్ కన్నడ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. చివరకు చిత్ర బృందం సైతం వ్యతిరేక సమీక్షలు చేయవద్దంటూ కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈ తరుణంలో కోర్టు సీరియస్ గా స్పందించింది. టాక్సిక్ మూవీ పట్ల ఎలాంటి కామెంట్స్ కానీ లేదా రీల్స్, వీడియోలు, సమీక్షలు చేపట్టవద్దని ఆదేశించింది.
ఈ తరుణంలో టాక్సిక్ చిత్రాన్ని విమర్శించినందుకు తెలుగు ప్రేక్షకులను తప్పుబడుతున్నారు కన్నడ అభిమానులు. సినిమా చూసిన తర్వాత కొంతమంది ప్రేక్షకులు దానిలోని కంటెంట్ పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. యష్ నటించిన టాక్సిక్ చిత్రాన్ని విమర్శించినందుకు తెలుగు ప్రేక్షకులపై వస్తున్న వ్యతిరేకతపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు అనవసరంగా లక్ష్యంగా చేసుకున్నారని కన్నడ ప్రేక్షకులలోని ఒక వర్గం ఆరోపిస్తోంది. అయితే ఈ వాదన ఏకపక్షంగా కనిపిస్తోంది. ఎందుకంటే కన్నడ అభిమానులు , ప్రేక్షకులు కూడా తమను ఆకట్టుకోని తెలుగు సినిమాలపై లేదా నటులపై బహిరంగంగా వ్యాఖ్యానించడం, సమీక్షించడం , విమర్శించడం చేస్తుంటారు.
కన్నడ సినిమాలపై వ్యాఖ్యానించే హక్కు తెలుగు ప్రేక్షకులకు ఎలా ఉందో, తెలుగు సినిమాలపై తమ అభిప్రాయాన్ని తెలిపే హక్కు కన్నడ ప్రేక్షకులకు కూడా అలాగే ఉంది. నచ్చని పక్షంలో కన్నడ అభిమానులు తెలుగు సినిమాను విమర్శించ గలిగినప్పుడు, టాక్సిక్ పట్ల తెలుగు ప్రేక్షకులు తమ అసహనాన్ని వ్యక్తం చేయడంలో తప్పు ఏమీ లేదు అని పేర్కొన్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్ -1, చాప్టర్ -2 , కాంతార వంటి సినిమాలను తెలుగు వారు ఆదరించారు. అక్కున చేర్చుకున్నారని గుర్తు చేశారు.

















