ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, అనలిస్ట్ మహమ్మద్ కైఫ్ నిప్పులు చెరిగాడు. శుక్రవారం తను ఓ మీడియా ఛానల్ తో చిట్ చాట్ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. టి20 కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ జట్టు ఎంపిక కమిటీని తప్పు పట్టారు. ఈ ఏడాది ఆరంభంలో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ టి20 ప్రపంచ కప్ గెలిచినప్పటికీ నాయకత్వ బాధ్యతలను శ్రేయాస్ అయ్యర్కు అప్పగించాలని, తిలక్ వర్మను వైస్ కెప్టెన్గా నియమించాలని బోర్డు నిర్ణయించిందన్న వార్తల నేపథ్యంలో ఈ విమర్శలు వచ్చాయి. ఐపీఎల్ ఆధారంగా సూర్యకుమార్ యాదవ్ నాయకత్వాన్ని అంచనా వేయడం సరికాదని కైఫ్ పేర్కొన్నారు. కేవలం ఐపీఎల్ ను ఆధారంగా కెప్టెన్ను అంచనా వేయకూడదని వాదించాడు కైఫ్, నిర్ణయాలు తీసుకోవడంలో ఎంపిక కమిటీ సభ్యులు మరింత స్థిరత్వాన్ని ప్రదర్శించాలని సూచించాడు.
వివిధ నివేదికల ప్రకారం ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల సిరీస్తో భారత్ తదుపరి టి20 పర్యటన ప్రారంభం కానుంది, ఆ తర్వాత జట్టు ఇంగ్లాండ్లో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ , మూడు వన్డేలు ఆడనుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, ఎంపిక కమిటీ శ్రేయాస్ అయ్యర్ను కొత్త కెప్టెన్గా నియమించే విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారని, తద్వారా క్రికెట్ అత్యంత చిన్న ఫార్మాట్లో నాయకత్వ మార్పుకు సంకేతాలు కనిపిస్తున్నాయని సమాచారం. ప్రపంచ కప్ గెలిచిన ఆటగాడిని కెప్టెన్సీ నుండే కాకుండా జట్టు నుండి కూడా తొలగించడం చాలా దురదృష్టకరం. ఏ ఆటగాడికీ ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదు. కానీ ఇలా ఎందుకు జరుగుతోంది? సెలక్షన్ కమిటీ కొంతకాలంగా ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటోందని మండిపడ్డాడు కైఫ్. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత కూడా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుండి తొలగించడం ఏమాత్రం సమంజసం కాదన్నాడు.



















