విజయవాడ: జస్టిస్ లీసా గిల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టులోని ఫస్ట్ కోర్ట్ హాల్లో ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ లీసా గిల్, పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తుండగా, అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. కాగా ఈ నెల ఏప్రిల్లో ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆమె నియామకం జరిగింది. ఆయన పదవీ విరమణ తర్వాత, జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి కానున్నారు.
చండీగఢ్కు చెందిన జస్టిస్ గిల్, పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి తన ఎల్ఎల్బి,ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ఆమె 1990లో పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం ద్వారా తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. సంవత్సరాలు గడిచేకొద్దీ, ఆమె అనేక రకాల కేసులను నిర్వహించి, రాజ్యాంగ, సివిల్ , సర్వీస్ సంబంధిత విషయాలలో విస్తృతమైన అనుభవాన్ని సంపాదించారు.
జస్టిస్ లీసా గిల్ మార్చిలో పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆమె న్యాయమూర్తిగా ఎన్నో కీలకమైన తీర్పులు వెలువరించారు. ప్రధానంగా మహిళలు, హక్కులు, కార్మికులు, ఉద్యోగుల సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి.


















