విశాఖపట్నం జిల్లా : జగన్ రెడ్డి నిర్వాకం వల్ల ఏపీ సర్వ నాశనం అయ్యిందని ఆరోపించారు మంత్రులు డోలా వీరాంజనేయ స్వామి, కందుల దుర్గేష్ , పయ్యావుల కేశవ్ తో కూడిన ఏపీ సబ్ కమిటీ రిషికొండ ప్యాలెస్ ను పరిశీలించింది. ఈ సందర్బంగా పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డిని ఏకి పారేశారు. అంతకు ముందు మంత్రుల బృందం ప్యాలెస్లోని ప్రతి బ్లాక్ను, ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. భవనాల లోపల అమర్చిన ఖరీదైన టైల్స్, బెడ్స్, ఫర్నీచర్, బాత్ టబ్స్, కమోడ్స్ వంటి అంతర్గత వసతులను, నిర్మాణ శైలిని పరిశీలించింది. అనంతరం భవనాలకు సంబంధించిన మ్యాప్లను పరిశీలిస్తూ ఒక్కో బ్లాక్ రూపకల్పన, వాటి ప్రస్తుత స్థితిగతులను పర్యాటక శాఖ ఇంజినీర్ అధికారులను, రెవెన్యూ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా రుషికొండ ప్యాలెస్తో పాటు, ఆ పరిసర ప్రాంతాల్లో మరియు బీచ్ రోడ్డుకు ఆనుకుని అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను కూడా కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా భవనాల భవిష్యత్తు వినియోగంపై విశాఖపట్నంలోని యాత్రినివాస్ లో మంత్రుల బృందం పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులతో కలిసి సుదీర్ఘంగా సమీక్షించారు. మంత్రుల బృందం మాట్లాడుతూ.. భవనాల భవిష్యత్తు వినియోగంపై ప్రజల ప్రయోజనాలు, ప్రభుత్వ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారుల నుంచి వివరాలు సేకరించినట్లు తెలిపింది. ఇప్పటికే ప్రఖ్యాత సంస్థలతో చర్చించామని, ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించామని పేర్కొన్నారు. ప్రజల నుండి పిచ్చాసుపత్రి, మ్యూజియం, ప్లానిటోరియం, కల్చరల్ హెరిటేజ్ సెంటర్, స్టేట్ గెస్ట్ హౌస్గా మార్చాలని, కొందరు కూల్చివేయాలని కూడా విభిన్న అభిప్రాయాలు వచ్చాయన్నారు.
ప్రజాధనం ఎలా వృథా చేశారో చూపించడానికి టికెట్ పెట్టి ప్రజలను, స్కూల్ పిల్లలను సందర్శనకు అనుమతించాలని కొందరు కోరారన్నారు.కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు బాధ్యతగా ఆలోచించారని పేర్కొన్నారు. ఈ ప్రాపర్టీ మినిమం మెయింటెనెన్స్కే నెలకు రూ.25 లక్షలు, దాని లావిష్నెస్ను అలాగే మెయింటెన్ చేయాలంటే దాదాపు రూ.1.5 కోట్లు అవుతుందని తెలిపారు. కాబట్టి మెజార్టీ అభిప్రాయం మేరకు దీనిని ‘రిసార్ట్’ (హాస్పిటాలిటీ) గా కొనసాగించడమే సముచితమని జీఓఎం భావిస్తోందన్నారు.
