అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. మంగళగిరి వేదికగా జరిగిన టీడీపీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము నిర్వహించిన మెగా డీఎస్సీపై జగన్ చేస్తున్నవన్నీ పచ్చి అబద్దాలని పేర్కొన్నారు. ఒక్క డీఎస్సీ కూడా పెట్టని వ్యక్తి మనపై విమర్శలు చేస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నా ఇంకా తను మారడం లేదన్నారు. ప్రజలు కేవలం 11 సీట్లకే పరిమితం చేసినా తన బుద్ది పోనిచ్చు కోవడం లేదంటూ ఎద్దేవా చేశారు. పోలవరం, అమరావతి నిర్ధిష్ట సమయంలో పూర్తి చేస్తాం అని ప్రకటించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 28 కొత్త పాలసీలతో పెట్టుబడులు తెస్తున్నామని, పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నామని చెప్పారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించి ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు ఇచ్చామన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్ర ఇకపై వెనుకబడిన ప్రాంతం కాదు అభివృద్ధికి కేంద్రంగా మార బోతోందన్నారు. గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు, ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకు వచ్చాయన్నారు సీఎం. అమరావతిని క్వాంటం నాలెడ్జ్ హబ్గా మార్చుతున్నామని ప్రకటించారు.
పోర్టులు నిర్మిస్తున్నామని, మౌళిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు సీఎం. రాయలసీమ రైజింగ్ నినాదంతో గోల్డ్ ఫీల్డ్, ఆమ్కా డిఫెన్స్ ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్ వంటివి తెచ్చామన్నారు. రాయలసీమ ప్రాంతాన్ని హర్టీకల్చర్ హబ్గా చేస్తామని ప్రకటించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ద్వారా కొత్త ఆవిష్కరణలను, పారిశ్రామిక వేత్తలను ప్రొత్సహిస్తున్నామని తెలిపారు.
