తాడేపల్లిగూడెం : ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ హయాంలో జరిగిన పోస్టుల భర్తీకి సంబంధించి విచారణకు సిద్దంగా ఉన్నామన్నారు. తాజాగా కూటమి సర్కార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ డీఎస్సీ -2026 లో స్కాం చోటు చేసుకుందన్నారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గురువారం జగన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. డీఎస్సీతో పాటు ఏపీపీసీసీ అంశాలపై పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. వీటికి సంబంధించి సాక్ష్యాలు, ఆధారాలు మీద్వారా ప్రజల ముందు ఉంచుతున్నట్లు తెలిపారు. డీస్సీ విషయంలో లీకేజీ, అక్రమాలపై మేం ఇప్పటివ రకూ ఏ అంశాలను అయితే ప్రజల ముందు ఉంచామో, అవన్నీ వాస్తవేమని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే పరిస్థితిలోకి వచ్చిందన్నారు మాజీ సీఎం. తప్పు చేశారు కాబట్టి, గింజుకుంటారే తప్ప, సీబీఐ విచారణకు మాత్రం ముందుకు రావడం లేదన్నారు.
ఇవన్నీ గట్టిగా లేవనెత్తుతామనే మాకు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపించారు జగన్ రెడ్డి. చివరకు ప్రతిపక్షం లేకుండానే సభను నడుపుతున్నారని మండిపడ్డారు. ప్రత్యర్థి జట్టు లేనిచోట, బౌలింగ్, పీల్డింగ్ లేకుండా, తండ్రీ కొడుకులు ఇద్దరూ బ్యాటింగ్ చేస్తున్నారని. తాము అద్భుతంగా చేశామని చెప్తున్నారంటూ ఎద్దేవా చేశారు. డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై చర్చ కావాలంటూ నాలుగు రోజులపాటు శాసనమండలిని తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు స్తంభింప చేశారన్నారు. కాని, అక్కడ డిస్కషన్ చేయడానికి ముందుకు రావడం లేదని ఎందుకంటూ ప్రశ్నించారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే డీఎస్సీలో తప్పులు జరిగాయి కాబట్టి, సీబీఐ విచారణ చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది అన్నారు. జరిగిన దానికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేసి తప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
డీఎస్సీ పరీక్షల ప్రశ్నల తయారీ–పరీక్ష నిర్వహణ రెండూ ఒకే అధికారి చేతిలో పెట్టినట్టు లోకేష్ స్వయంగా అంగీకరించారని ఇంతకంటే ఇంకేం కావాలని ప్రశ్నించారు జగన్ రెడ్డి. అంగీకరించడమే కాకుండా, తప్పేముంది అని దబాయించాడని అన్నారు. డీఎస్సీ పరీక్షలకు అవసరమైన ప్రశ్నల తయారీ అనేది SCERT డైరెక్టర్ బాధ్యత, డీఎస్సీ పరీక్షను నిర్వహించే బాధ్యత డీఎస్సీ కన్వీనర్ది. ఈ రెండూ, ఒకే వ్యక్తికి అప్పగించడం ద్వారా పారదర్శకతకు పాతరవేసి, లీకేజీకి స్వయంగా ద్వారాలు తెరిచారని ఆరోపించారు. స్కాం ఇక్కడ నుంచే మొదలు పెట్టార్నది చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
