హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భారత్ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేసింది. దీనిని ఎక్కువగా హైలెట్ చేస్తూ వస్తున్నారు సీఎం. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన ప్రముఖులు, సంస్థలతో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2025 ను నిర్వహిస్తోంది. ఇందు కోసం భారీగా ఖర్చు చేస్తోంది. ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు కూడా పంపింది. డిసెంబర్ 8,9వ తేదీలలో రెండు రోజుల పాటు ఈ సమ్మిట్ జరగనుంది. రాష్ట్ర భవిష్యత్తును ప్రదర్శించే గ్లోబల్ సమ్మిట్లో మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరుగుతాయి. గ్లోబల్ లీడర్లు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, విద్యావేత్తలు, ప్రముఖులు , దేశ విదేశాల నుండి సమ్మిట్ కు హాజరవుతున్నారు.
కాగా వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు తమ అనుభవాలను పంచుకుంటారు. ఈ ప్రధాన సమ్మిట్ లో ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ-సెమీకండక్టర్స్, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, మహిళా వ్యవస్థాపకుల ప్రమోషన్, గిగ్ ఎకానమీ, సోషల్ వెల్ఫేర్ , స్టార్టప్లలో అనేక మంది జాతీయ , అంతర్జాతీయ ప్రతినిధులు, నిపుణులు ప్రతి రంగంలో వృద్ధి సామర్థ్యంపై ప్రదర్శనలు ఇస్తారు. అంతే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, యూనిసెఫ్, టేరి, బీసీజీ, మైక్రోన్ ఇండియా, హిటాచీ ఎనర్జీ, O2 పవర్, గ్రీన్కో, అపోలో హాస్పిటల్స్, ఐఐటీ హైదరాబాద్, నాస్కామ్ , సఫ్రాన్, డీఆర్డీఓ, స్కైరూట్, ధ్రువ స్పేస్, అముల్, లారస్ ల్యాబ్స్, జీఎంఆర్, టాటా రియాల్టీ, కోటక్ బ్యాంక్, గోల్డ్మన్ సాచ్స్, బ్లాక్స్టోన్, డెలాయిట్, క్యాపిటాల్యాండ్, స్విగ్గీ, ఏడబ్ల్యూఎస్ , రెడ్ నుండి ప్రతినిధులు పాల్గొంటారని సర్కార్ తెలిపింది.

















