తిరుపతి : కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టిటిడి జేఈవో డా. ఎ. శరత్ ఆలయాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్నందున ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లను మరింత పటిష్టంగా తీర్చిదిద్దడం, డ్రైనేజీ వ్యవస్థ మరమ్మతులు చేపట్టడం, పరిశుభ్రతను మెరుగు పరచడం వంటి అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేసి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు డాక్టర్ ఎ. శరత్. మరో వైపు రోజు రోజుకు తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తుల తాకిడి ఏ మాత్రం తగ్గడం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో బి. నాగరత్న, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి గిరిధర్, డీఈలు రవిశంకర్ రెడ్డి, సరస్వతి, ఈఈలు మల్లికార్జున ప్రసాద్, శ్రీమతి సుమతి, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ డా. సునీల్ ప్రసాద్, సూపరింటెండెంట్ కె.పి. చంద్రశేఖర్ ,తదితర అధికారులు పాల్గొన్నారు.
