తిరుపతి : ప్రతిరోజూ యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఆత్మ విశ్వాసం, ధైర్యం పెంపొందుతాయని టిటిడి జేఈవో డా. ఎ. శరత్ అన్నారు. “యోగ–టిటిడి ఆరోగ్యానంద” కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న యోగ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా టిటిడి ఈవో ఎం. రవిచంద్ర ఆదేశాల మేరకు టిటిడి ఉద్యోగులకు ఈ నెల 7 నుండి 21వ తేదీ వరకు 15 రోజుల యోగ శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మనస్ఫూర్తిగా యోగాభ్యాసం చేస్తే ఆరోగ్యం మెరుగు పడటమే కాకుండా కుటుంబ జీవితంలో ఆనందం, సౌఖ్యం నెలకొంటాయని చెప్పారు జేఈవో శరత్ . శిక్షణలో పాల్గొంటున్న ఉద్యోగులు ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే యోగ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగానే సీఎం ఆదేశాల మేరకు ఈవో ఆధ్వర్యంలో యోగ ఆరోగ్య కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి వెల్ఫేర్ డిప్యూటీ ఈవో ఆనందరావు, ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. నారాయణమ్మ, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
