బెంగళూరు : సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఎందుకు ఏర్పాటు చేశామనే దానిపై క్లారిటీ ఇచ్చారు. చెరువులు, నాలాలను పేదలు ఆక్రమించుకుంటే అర్ధం చేసుకోగలం అన్నారు. కానీ పెద్దవాళ్లు జల వనరులను చెరబడుతున్నారని ఆరోపించారు సీఎం. బెంగళూరు వేదికగా జరిగిన ది హిందూ కాన్ క్లేవ్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. వీటిని నియంత్రించేందుకే హైడ్రాను ఏర్పాటు చేశామన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి హైడ్రాకు నేతృత్వం వహిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు మా దగ్గర ఎవరైనా జల వనరులను ఆక్రమించే ధైర్యం చేస్తున్నారేమో అడగండి అని ప్రశ్నించారు.
డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈగల్ ఫోర్స్ను ఏర్పాటు చేశాం అన్నారు సీఎం. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడుతున్నారు. మా ఈగల్ ఫోర్స్ దేశంలోనే అత్యుత్తమ ఫోర్స్ అని కితాబు ఇచ్చారు. డ్రగ్స్ను నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టకున్నాం అని ప్రకటించారు . కులతత్వాన్ని నిర్మూలించాలని చెబుతూనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్స్ను ప్రభుత్వాలు ఏర్పాటు చేశామన్నారు. దీంతో కులతత్వాన్ని నిర్మూలించేందుకు ఎటువంటి అంతరాలు లేకుండా అంతా కలిసి ఉంచేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం అని వెల్లడించారు రేవంత్ రెడ్డి.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ మేం చేపట్టాం. గుజరాత్ కూడా సుప్రీంకోర్టును అమలు చేయలేదు. 1931 తర్వాత దేశంలో కుల గణన చేపట్టలేదు. మేం మా రాష్ట్రంలో కుల గణన చేపట్టాం.. కుల గణన లేకుండా ఎలా బీసీలకు మీరు పథకాలు ఇవ్వగలరు.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్లలోనూ పలు ఉప కులాల నుంచి ఒక్క డాక్టర్ లేరు.. విద్యాపరంగా వెనుకబడడమే వెనుకబాటుతనానికి కారణం అని పేర్కొన్నారు.
