హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో పలు దుకాణాల యజమానులు రూల్స్ కు విరుద్దంగా వ్యవహరిస్తుంండడంతో హైడ్రా రంగంలోకి దిగింది. పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ఫైర్ సేఫ్టీపై విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. GHMC, హైడ్రా, ఫైర్, విద్యుత్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఫైర్ నిబంధనలను పట్టించుకోకుండా షాపులు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు. సెల్లార్లను గోదాములుగా మార్చడాన్ని అధికారులు సీరియస్గా పరిగణిస్తున్నారు. కెమికల్, పెయింట్ డబ్బాలు నిలువ ఉంచడం, ఫర్నీచర్ తయారీ సామగ్రీతో పరిసరాలు నిండి ఉండడాన్ని గమనించారు. భవన అనుమతులు, ఫైర్ ధ్రువీకరణ పత్రాలు( ఫైర్ ఎన్వోసీలు) లేక పోవడాన్ని పలు భవనాల్లో గుర్తించారు.
అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మానవ ప్రమేయం లేకుండా.. ఆటోమేటిక్గా పని చేసే వాటర్ స్ప్రింక్లర్లు, స్మోక్ డిటెక్టర్లు లేకపోవడం, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కానరాని పరిస్థితుల నేపథ్యంలో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న 6 షాపులను అధికారులు సీజ్ చేశారు. షాపులుంటున్న భవనాలను గోదాములుగా మార్చరాదని చెబుతూ వస్తోంది. గోదాములు వేరే చోట పెట్టుకుని.. షాపుల్లో ఫర్నీచర్ ప్రదర్శన, అమ్మకాలు మాత్రమే ఉండేలా చూడాలని హైడ్రా చెబుతూ వస్తోంది. అయినా పట్టించుకోక పోవడంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి ఇలాగే వ్యవహరిస్తే పూర్తిగా దుకాణాలు నిర్వహించకుండా శాశ్వతంగా రద్దు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.

















