హైదరాబాద్ : వర్షాకాలం వచ్చినా నేటికీ తెలంగాణాలో వర్షాలు రాక నానా తంటాలు పడుతున్నారు రైతులు. నిన్నటి దాకా సాగు, తాగు నీటికి కటకట మనే పరిస్థితి ఇప్పటి నుంచే నెలకొంది. ఓ వైపు ఎండలు మండుతున్నాయి. జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ అంతటా రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేయగా, దక్షిణ , మధ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్ , కరీంనగర్ వంటి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, వరంగల్ , ఖమ్మం వంటి తూర్పు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఇవాళ ఆదిలాబాద్, నిజామాబాద్ , జగిత్యాల జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు. మరుసటి రోజు ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల , పెద్దపల్లి జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించారు. అదనంగా, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు.
