సంగారెడ్డి జిల్లా : మరోసారి తన ఉదారతను చాటుకున్నారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. ఎంబీబీఎస్ సీటు సాధించిన పేద దళిత విద్యార్థిని పెర్క శ్రీజను అభినందించారు. తన చదువు కోసం అయ్యే ఫీజను తానే చెల్లిస్తానంటూ ప్రకటించారు. అంతేకాదు తనకు ఆర్థిక సాయం చేశారు. దీంతో పేరెంట్స్ మాజీ మంత్రికి రుణపడి ఉంటామని తెలిపారు. ఇదిలా ఉండగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గురుకుల పాఠశాలలో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు హరీష్ రావు. ఇదిలా ఉండగా తన కూతురుకు ఎంబీబీఎస్ సీటు వచ్చినా తనకు చదివించే ఆర్థిక స్తోమత లేదని , ఆదుకోవాలని కోరుతూ హరీశ్ రావుకు లేఖ రాశారు పెర్క శ్రీజ తండ్రి.
దీంతో వెంటనే స్పందించారు మాజీ మంత్రి. ఎంబీబీఎస్ కోర్సు మొదటి సంవత్సరం కింద నిర్దేశించిన ఫీజు రూ. 60 వేల ఆర్థిక సాయం అందించారు. అంతే కాకుండా కీలక ప్రకటన చేశారు హరీశ్ రావు. ఎం బీబీ ఎస్ పూర్తి అయ్యే వరకు ప్రతి ఏటా కళాశాల ఫీజు తానే చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మెడికల్ కళాశాలల ఏర్పాటుతో పాటు వైద్య విద్య సీట్లు పెంచిన ఫలితమే ఇందుకు నిదర్శనం అన్నారు. వైట్ కోట్ విప్లవం సృష్టించి బడుగు, బలహీన వర్గాలను వైద్య విద్య దిశగా బాటలు వేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ధనిక కుటుంబాలకే ఎంబీబీఎస్ చదువు.. ఆర్థిక స్తోమత ఉన్నవారికే వైద్య విద్య.. డబ్బుంటేనే ఒంటిపై వైట్ కోట్ అనేది గతంలో రాష్ట్రం ఏర్పడక ముందు ఉండేదన్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందన్నారు.
