Gold : దేశంలో బంగారం నిల్వలు ఏటేటా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి భారతదేశంలో మొత్తం 34,600 టన్నుల పసిడి నిల్వలు ఉన్నట్లు అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదికలో పేర్కొంది. ఇందులో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)తో పాటు, ప్రజల వద్ద ఉన్న బంగారం (Gold) కూడా చేర్చబడి ఉంది.
ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం, ఈ నిల్వల మొత్తం విలువ 3.78 లక్షల కోట్ల అమెరికా డాలర్లు (దాదాపు రూ.335.69 లక్షల కోట్లు)గా అంచనా వేయబడింది. ఈ విలువ దేశీయ కుటుంబాలు ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టిన 1.18 లక్షల కోట్ల డాలర్ల కంటే 3.1 రెట్లు ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. అదనంగా, పసిడి విలువ భారత జీడీపీతో పోల్చితే 88.8 శాతంగా ఉందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది.
Gold – ప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద వినియోగదారుల దేశం – భారత్
ప్రపంచ స్వర్ణ మండలి (WGC) నివేదిక ప్రకారం, చైనా తర్వాత ప్రపంచ పసిడి వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉంది. గత ఐదేళ్ల గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా జరిగే వార్షిక పసిడి కొనుగోళ్లలో చైనా 28 శాతం, భారత్ 26 శాతం వాటాను కలిగి ఉంది. దేశీయంగా పసిడి ఉత్పత్తి పరిమితంగా ఉండటం వల్ల, భారత అవసరాల్లో 99 శాతం దిగుమతుల ద్వారానే నెరవేర్చబడుతున్నాయి. ప్రతి సంవత్సరం భారత్ 750 నుండి 840 టన్నుల వరకు బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది.
భారతీయుల బంగారంపై మమకారం
భారతీయ సంస్కృతిలో బంగారం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. పండగలు, వివాహాలు, ధార్మిక వేడుకలు ఏవైనా బంగారం లేకుండా జరగడం అరుదు. ముఖ్యంగా ధనత్రయోదశి వంటి పర్వదినాల్లో బంగారం దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. ధరలు పెరిగినా, ప్రజలు తమ సామర్థ్యానుసారం బంగారం కొనుగోలు చేయడంలో వెనుకాడరు.
ఇటీవలి కాలంలో బంగారం పెట్టుబడులుగా కూడా విస్తృతంగా కొనుగోలు అవుతోంది. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న బంగారంలో 30 శాతం బిస్కెట్లు, నాణేలు, కడ్డీల రూపంలో ఉంది. వీటిని ఎక్కువగా పెట్టుబడి లాభాల కోసం కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక అనిశ్చితి, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, స్టాక్ మార్కెట్ ఊహించలేని మార్పులు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఇన్వెస్టర్లను పసిడి వైపు ఆకర్షిస్తున్నాయి.
బంగారం రుణ మార్కెట్ విస్తరణ
దేశంలో పసిడి నిల్వల పెరుగుదలతో పాటు బంగారం రుణ మార్కెట్ కూడా వేగంగా విస్తరిస్తోంది. క్రెడిట్ రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా ప్రకారం, 2026 మార్చి నాటికి సంఘటిత రంగంలోని పసిడి రుణ మార్కెట్ పరిమాణం రూ.15 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. 2027 నాటికి ఇది మరింత విస్తరించి రూ.18 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.
ఇక్రా గత ఏడాది అంచనాలను సవరిస్తూ, బంగారం ధరలు గత ఏడాదిలో వేగంగా పెరగడం ఈ విస్తరణకు కారణమని పేర్కొంది.
బ్యాంకుల ఆధిపత్యం
పసిడి రుణాల విషయంలో బ్యాంకులు ఎన్బీఎఫ్సీలను మించిపోయాయి. 2020–2025 మధ్యకాలంలో ఎన్బీఎఫ్సీల పసిడి రుణాల మార్కెట్ ఏటా సగటున 20 శాతం చొప్పున పెరిగితే, బ్యాంకుల రుణాల వృద్ధి రేటు 26 శాతంగా నమోదైంది. 2025 మార్చి నాటికి మొత్తం రూ.11.8 లక్షల కోట్ల పసిడి రుణాల్లో 82 శాతం వాటా బ్యాంకులదే అని ఇక్రా నివేదిక స్పష్టం చేసింది.
Also Read : Today Gold Price : స్వల్పంగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు
