తిరుపతి : తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఆధ్వర్యంలో వరుసగా బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ఆనందంగా ఉందన్నారు. మంగళవారం తిరుపతిలో బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారు. మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ఎస్వీయూ సెనేట్ హాల్ లో కొనసాగుతోంది. వరుసగా ఐదవ బడ్జెట్ ప్రవేశ పెట్టే కౌన్సిల్ కి మేయర్ గా ఉండే అవకాశం నాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అది మీ అందరి సహకారంతోనే నాకు ఈ గౌరవం లభించిందని చెప్పారు. అందుకు వ్యక్తిగతంగా ప్రత్యేక అభినందనలు. చివరి బడ్జట్ గ్రేటర్ తిరుపతి నగర బడ్జెట్ గా పెట్టే అవకాశం వస్తుందని తనకు ఆశ ఉండేదన్నారు. గ్రేటర్ ఆలస్యం అవుతున్నందుకు కొంత అసంతృప్తి ఉన్నా నాకు నమ్మకం ఉందన్నారు. కౌన్సిల్ తరపున గతంలో కౌన్సిల్ ఆమోదించిన గ్రేటర్ తిరుపతికి ఆమోదం తెలపాలని కోరారు డాక్టర్ శిరీష.
బడ్జెట్ అనేది ఒక నిర్ణీత కాలానికి (సాధారణంగా ఒక సంవత్సరం) రాబోయే ఆదాయ, వ్యయాల అంచనా ఆర్థిక ప్రణాళిక అని పేర్కొన్నారు మేయర్. ఇది కుటుంబం, వ్యాపారం లేదా దేశం, మన లాంటి నగరం ఆర్థిక వనరులను సమర్థవంతంగా ఉపయోగించడానికి, అనవసరమైన ఖర్చులను తగ్గించు కోవడానికి , పొదుపును పెంచుకోవడానికి సహాయపడే ఒక నివేదిక అని స్పష్టం చేశారు. వీలైనంత వరకు మన బడ్జెట్ ను సమతుల్యత బడ్జెట్ గా రూపొందించుకుంటే బాగుంటుందని సూచించారు మేయర్. బడ్జెట్ రూపకల్పనలో సమతుల్యత లోపిస్తే ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు డాక్టర్ శిరీష.


















