అమరావతి : వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడే ముందు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. గోబెల్స్ లా తప్పుడు ప్రచారం చేయడంలో జగన్ సిద్ధహస్తుడు, గత ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ విషయంలో రైతులకు కేంద్రం వాటా కాకుండా 13 వేల సహాయం ఇస్తామని చెప్పి, కేంద్రం-రాష్ట్రం వాటాలను కలిపి ఇచ్చింది మీరే. మేము మాత్రం రైతులను మోసం చేయలేదు. కేంద్రం వాటా ఎంత, రాష్ట్రం వాటా ఎంత అనేది స్పష్టంగా విడివిడిగా మ్యానిఫెస్టోలో చెప్పి పారదర్శకత చూపించాం. రైతులను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మాకు తెలియవు. ఆక్వా రైతులపై ఇప్పుడు కపట ప్రేమ చూపిస్తూ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. మీ హయాంలో ముడి సరుకుల ధరలు పెరగకపోయినా, ఆక్వా ఫీడ్ ధరలను ఏకంగా 7 సార్లు పెంచి, కిలోకు ₹90 ఉన్న ఫీడ్ను ₹110.06కి తీసుకెళ్లింది నిజం కాదా? ఆ కంపెనీలపై మీకు ఉన్న ప్రేమ ఏమిటి? వారి దగ్గర మీ లాలూచీ ఏమిటో ప్రజలకు చెప్పాలని అన్నారు.
2024లో అధికారంలోకి రాగానే తాము ఫీడ్ ధరలను తగ్గించాం అన్నారు. ఇప్పుడు అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఉంది, ముడి సరుకుల ధరలు భారీగా పెరిగాయి. ఫ్యాక్టరీలు నష్టాల్లో నడుస్తున్నా, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశ్రమ ప్రతినిధులు, రైతులతో సమావేశాలు నిర్వహించి, 2022 నాటి ధరలకే పరిమితం చేశాం. కొత్తగా ధరలు పెంచిన దాఖలాలు లేవు. అలాంటప్పుడు ఆక్వా ఫీడ్ ధరలపై అసత్య ప్రచారం చేసి రైతులను రెచ్చగొట్టడం ఎందుకు జగన్? అని ప్రశ్నించారు. పొగాకు రైతుల విషయంలో కూడా మీ రాజకీయ కుట్రలు ఆగడం లేదు. హెచ్డీ బర్లీ పొగాకు, వర్జినీయా పొగాకుకు తేడా తెలుసా జగన్ నీకు అని మండిపడ్డారు. గత ఏడాది హెచ్డీ బర్లీ పొగాకు రైతులకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కాబట్టి ప్రభుత్వం ముందుకు వచ్చి రూ. 273 కోట్ల సాయాన్ని రైతులకు అందించిందని చెప్పారు.
















