విజయవాడ : ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు కొత్త సంవత్సరం పురస్కరించుకుని భారీ ఎత్తున సాంస్కృతిక, సాహిత్య , పర్యాటక రంగాలకు సంబంధించి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఇందుకు సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అమ్రాపాలి కాట. ఇదిలా ఉండగా ఈ ఫెస్టివల్ కు భిన్నంగా పేరు పెట్టారు. ఏపీ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది ఆవకాయ్ అంటే మామిడి . ఏపీకి చెందిన పచ్చళ్లకు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. దీనినే నమ్ముకుని భారీ మీడియా, వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు దివంగత రామోజీరావు. ఇక ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోయే ఫెస్టివల్ ను విజయవాడ లోని పున్నమి ఘాట్ సమీపంలో జనవరి 8 నుంచి 10 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో ‘ఆవకాయ్ అమరావతి’ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు మంత్రి కందుల దుర్గేష్.
ఈ ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కవులు, కళాకారులు, రచయితలు, గాయనీ గాయకులు, సినీ రంగానికి చెందిన నటీ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు హాజరవుతారని తెలిపారు. పెద్ద సంఖ్యలో నగరవాసులు, సందర్శకులు కార్యక్రమానికి తరలివచ్చే అవకాశం ఉందన్నారు. విజయవాడ కార్పొరేషన్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. కాగా ప్రభుత్వ స్థలంలోనే ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీ షా స్పష్టం చేశారు.















