Pawan Kalyan : అమరావతి : పిఠాపురం నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలని, ఎన్ని నిధులైనా విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). శక్తిపీఠం శ్రీ పురూహూతిక అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం, శ్రీపాద శ్రీవల్లభ పీఠం కొలువై ఉన్నాయని అన్నారు. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికను వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ప్రఖ్యాత ఆలయాలతోపాటు నియోజకవర్గంలో జీర్ణావస్థకు చేరిన ఆలయాలను ఇప్పటికే గుర్తించామని, వాటికి పునరుజ్జీవం కల్పించే పనులుకు అవసరమైన నిధులు దేవాదాయ శాఖ సమకూర్తుస్తుందని చెప్పారు. దేవాదాయ శాఖ సహకారంతో ఆలయాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని అన్నారు.
DY CM Pawan Kalyan Important Update on Pitapuram
ప్రధాన ఆలయాలు అయిన శ్రీ పురూహూతిక అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వరస్వామి, శ్రీపాద శ్రీ వల్లభస్వామి ఆలయాలతో పాటు 19 ఆలయాల పునరుద్ధరణకు కామన్ గుడ్ ఫండ్ నుంచి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు ఇప్పటికే దేవాదాయ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించిందని పేర్కొన్నారు. మ్యాచింగ్ గ్రాంట్ తో నిధులు మంజూరు చేస్తారన్నారు. ఇందులో రూ.6 కోట్లు శ్రీ పురూహూతిక అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి కేటాయిస్తున్నారన్నారు. మరో నాలుగు ఆలయాలను ధూప దీప నైవేధ్యం పథకం పరిధిలోకి తీసుకునేందుకు ముందుకు వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్.
కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, పరిరక్షణకు కట్టుబడి ఉంటుందన్నారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, దేవాదాయ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సమీక్ష చేశారు. కార్తీక మాసంలో ఆలయాల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. చివరి కార్తీక సోమవారం సందర్భంగాను, కార్తీక మాసం ముగిసే రోజు ఆలయాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండవచ్చనీ, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. మహిళా భక్తులకు దర్శనాలు, పూజల దగ్గర ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆలయాల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అందులో భాగంగా దేవాలయాల అభివృద్ధి, టెంపుల్ టూరిజంలో భాగంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయని చెప్పారు.
Also Read : Hero Mahesh babu – Varanasi : నా తండ్రి కోరిక వారణాసితో నెరవేరింది
