న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వాట్సాప్ యూనివర్సిటీ అభిప్రాయాలు తప్ప మిగిలిన అన్ని అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు సీజేఐ . కేరళలోని శబరిమల ఆలయంతో సహా మతపరమైన ప్రదేశాలలో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై విచారణ జరుపుతున్నప్పుడు సుప్రీంకోర్టు ఈ ప్రకటన చేసింది. సీజేఐ సూర్యకాంత్ మాట్లాడారు. తాము ప్రముఖ వ్యక్తులు, న్యాయవేత్తలు మొదలైన వారందరినీ గౌరవిస్తాం, కానీ వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయమే అని స్పష్టం చేశారు. తాము ప్రముఖ రచయితలు, మేధావులందరి అభిప్రాయాలను గౌరవిస్తామని అన్నారు. అయితే ‘వాట్సాప్ యూనివర్సిటీ’ నుండి సమాచారాన్ని స్వీకరించలేమని సుప్రీంకోర్టు గురువారం కుండ బద్దలు కొట్టింది.
కేరళలోని శబరిమల ఆలయంతో సహా మతపరమైన ప్రదేశాలలో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై, బహుళ మతాలు పాటించే మత స్వేచ్ఛ పరిధి, విస్తృతిపై విచారణ జరుపుతున్నప్పుడు తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్తో పాటు జస్టిస్లు బి.వి. నాగారత్న, ఎం.ఎం. సుందరేష్, అహ్సనుద్దీన్ అమానుల్లా, అరవింద్ కుమార్, అగస్టిన్ జార్జ్ మసిహ్, ప్రసన్న బి. వరలే, ఆర్. మహాదేవన్, జయమాల్య బాగ్చి ఉన్నారు. దావూదీ బోహ్రా సమాజ అధిపతి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్, మత పరమైన ఉపశమన విషయాలలో న్యాయపరమైన సంయమనం గురించి మాట్లాడిన కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రస్తావించారు.
జ్ఞానం, వివేకం ఏ మూలం నుండి, ఏ దేశం నుండి, ఏ విశ్వవిద్యాలయం నుండి వచ్చినా, దానిని స్వాగతించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అన్ని రకాల జ్ఞానాన్ని, సమాచారాన్ని స్వీకరించకుండా ఉండలేనంత గొప్ప నాగరికత మనది అని కౌల్ అన్నారు. 10 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తున్న నిషేధాన్ని ఎత్తివేసింది. శతాబ్దాల నాటి ఈ హిందూ మత ఆచారం చట్టవిరుద్ధం అని పేర్కొంది.


















