హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. విద్యా రంగానికి సంబంధించి ఎలాంటి ఆలస్యం ఉండ కూడదని అన్నారు. పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసేందుకు సర్కార్ సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ప్రత్యేకించి ప్రతి ఒక్క విద్యార్థికి కనీస వసతులు కల్పించాలనేది తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు సీఎం. హైదరాబాద్ లో తన క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల విద్యార్థులకు 22 వస్తువులతో అందించబోయే కిట్స్ కు సంబంధించి సెంట్రల్ ప్రొక్యూర్ మెంట్ పై కీలక సూచనలు చేశారు. ఈ సమీక్షా సమావేశానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ కిట్లలో వస్తువుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడొద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు కిట్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. ఈ కిట్ లో యూనిఫామ్ తో పాటు స్కూల్ బెల్ట్, టై, షూస్, స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్ ఇట్లా మొత్తం 22 రకాల వస్తువులను చేర్చాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. వస్తువుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.















