తిరుపతి : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలో జరుగుతున్న వసంతోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగాయి. స్వర్ణ రథోత్సవం భక్తి వైభవంతో అద్భుతంగా జరిగింది. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మ వారు స్వర్ణరథంపై ఆశీనురాలై భక్తులకు దివ్య కటాక్షం ప్రసాదించారు. ఆలయంలో వైదిక కార్యక్రమాల అనంతరం అర్చకులు అమ్మవారి ఉత్సవ మూర్తిని శాస్త్రోక్తంగా స్వర్ణరథంపై ప్రతిష్ఠించారు. అనంతరం నాలుగు మాడ వీధుల్లో స్వర్ణరథం సంచరించగా, భక్తుల గోవింద నామస్మరణలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి పోయింది.
ప్రత్యేకంగా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని అపార భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగడం విశేష ఆకర్షణగా నిలిచింది. కర్పూర హారతులు సమర్పిస్తూ అమ్మ వారి దివ్య దర్శనంతో భక్తులు ఆధ్యాత్మికానందంలో మునిగి పోయారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఎస్ ఈ నరసింహ మూర్తి, ఏఈఓ దేవరాజులు, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ చెంగల్ రాయులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ చలపతి తదితర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా వసంతోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున అమ్మ వారి దివ్య కటాక్షం కోసం బారులు తీరారు భక్త బాంధవులు.


















