హైదరాబాద్ : మాస్ మహారాజా కీలక పాత్రలో నటించిన చిత్రం ఇరుముడి. ఎవరూ ఊహించని రీతిలో ఈ మూవీ ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ఇంకా సినిమా థియేటర్లకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు వస్తున్నారు. ఇదిలా ఉండగా ఇరుముడి బిగ్ సక్సెస్ కావడంతో కీలక అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ కూడా ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు దర్శకుడు శివ నిర్వాణ. ప్రస్తుతం ‘ఇరుముడి 2’ని రూపొందించే ఆలోచన ఏదీ లేదని కుండ బద్దలు కొట్టాడు.. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఈ చిత్రం అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. రవితేజ ,బాలనటి నక్షత్ర ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
హైదరాబాద్లో చిత్ర బృందం విజయోత్సవ వేడుకలను నిర్వహించింది. రామ్ చరణ్తో సీక్వెల్ ఉంటుందన్న వార్తల గురించి మీడియా ప్రతినిధులు శివ నిర్వాణను అడిగారు. ఆ ఆలోచన చాలా బాగుందని దర్శకుడు అంగీకరించారు. అయితే సీక్వెల్ అనేది సహజంగా జరగాలని ఆయన స్పష్టం చేశారు. పోస్ట్-ప్రొడక్షన్ సమయంలోనే సోషల్ మీడియాలో ఈ పుకారు వ్యాపించడం మొదలైందని ఆయన వివరించారు. ఆ వార్తలను చూసి శివ నిర్వాణ ఆశ్చర్య పోయారు. మొదట్లో వాటిని సాధారణ ఆన్లైన్ ఊహాగానాలుగా భావించి పట్టించు కోలేదన్నాడు. కానీ తర్వాత, జర్నలిస్టులు అదే పుకారు గురించి పదే పదే అడగసాగారు. ప్రజలు తప్పుదోవ పట్టకూడదనే ఉద్దేశంతో ఆయన చివరకు స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ‘ఇరుముడి 2’ చేసే ప్రణాళికలేవీ లేవన్నారు. ఇదిలా ఉండగా ‘ఇరుముడి’లో ప్రియా భవాని శంకర్ కాకుండా సాయి కుమార్ , స్వసిక విజయ్ కూడా నటించారు.















