తిరుమల : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చారు. ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం వైభవంగా జరిగిన సింహ వాహనసేవలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయ, జానపద కళారూపాలను ప్రదర్శించి భక్తులను విశేషంగా అలరించారు. స్వామివారి వాహన సేవకు కళాకారుల ప్రదర్శనలు భక్తి భావాన్ని, సాంస్కృతిక వైభవాన్ని మరింత ఇనుమడింప జేశాయి.
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు పాల్గొన్నాయి. మొత్తం 19 కళాబృందాలకు చెందిన 494 మంది కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల కళాకారులు దశావతారాలు, భరత నాట్యం, కథక్, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు . హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గౌరసూర్ బోద్/చౌ, జానపద నృత్యాలు, డ్రమ్స్, కోలాటం తదితర సంప్రదాయ కళా రూపాలను ప్రదర్శించారు.
అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో చౌలియా, మేవశిరాస్, జానపద నృత్యం, గోందల్ నృత్యం వంటి వైవిధ్యభరిత సంప్రదాయ కళారూపాలు కనువిందు చేశాయి. దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తాళములతో జానపద నృత్యం, డ్రమ్స్, నవదుర్గలు, శ్రీరామ చరితం, కోలాటం తదితర కళారూపాలను కళాకారులు ప్రదర్శించారు. శ్రీవారి సింహ వాహన సేవలో 19 కళా బృందాలకు చెందిన 494 మంది కళాకారులు పాల్గొని తమ అద్భుతమైన కళా ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు. వివిధ రాష్ట్రాల సంప్రదాయ కళా రూపాలు తిరుమలలో భక్తి, కళ, భారతీయ సంస్కృతుల సమ్మేళనాన్ని ఆవిష్కరించాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల సాంప్రదాయ, జానపద కళారూపాలకు వేదిక కల్పిస్తూ టీటీడీ నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు భారతీయ కళా వైవిధ్యాన్ని పరిచయం చేస్తున్నాయి.
