తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా, కలియుగ దైవంగా భావించే తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎలాంటి టికెట్లు లేకుండా వచ్చే భక్తులకు ఉచితంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ( టీటీడీ) స్లాటెడ్ సర్వ దర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్లు ఇస్తోంది. అయితే ఇవాళ రద్దీ అధికంగా ఉండడంతో ఉన్నట్టుండి టీటీడీ ఎస్ఎస్డీ టోకెన్లు ఇవ్వడం లేదని, రద్దు చేసినట్లు ఉన్నట్టుండి ప్రకటించింది. తిరుమలలో భక్తుల దర్శనం కోసం ఉద్దేశించిన టోకెన్ల జారీని మూడు కేంద్రాల్లో రద్దు చేసినట్లు పేర్కొంది, దీనివల్ల అనేకమంది యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారుల సమాచారం ప్రకారం శుక్రవారం నాటి దర్శనానికి సంబంధించిన SSD టోకెన్లను గురువారం జారీ చేస్తారు. టోకెన్ల జారీ రద్దు భక్తులకు, ముఖ్యంగా దూర ప్రాంతాల నుండి వచ్చి తమ యాత్ర కోసం ముందుగానే ఏర్పాట్లు చేసుకున్న వారికి ఇబ్బందులు కలిగించిందని సమాచారం.
ఈ రద్దు తమకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణం , వసతి ఏర్పాట్లను చాలా ముందుగానే చేసుకోవాల్సి ఉంటుందని, టోకెన్ల జారీలో ఇలాంటి ఆకస్మిక మార్పులు తమను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టవచ్చని చాలామంది యాత్రికులు పేర్కొన్నారు. ఈ నెల చివరలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నందున, తిరుమలను సందర్శించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కాగా, ఆగస్టు నెలలో తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆ నెలలో మొత్తం 24.56 లక్షల మంది భక్తులు ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించగా, తిరుమల తిరుపతి దేవస్థానంహుండీ ఆదాయం రూ. 137.44 కోట్లుగా నమోదైంది. బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో, భక్తుల రద్దీని నిర్వహించడానికి , ఎటువంటి ఆటంకం లేని దర్శన ఏర్పాట్లను కల్పించడానికి తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు.



















