హైదరాబాద్ : రాబోయే రోజుల్లో క్వాంటం టెక్నాలజీకి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోందని అన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. క్వాంటం కోసం నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ను తయారు చేయడం పట్ల ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ క్వాంటం స్ట్రాటజీని ఐఐఐటి హైదరాబాద్లో ప్రారంభించారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అనే మన తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికతకు అనుగుణంగా పరిశోధన, నైపుణ్యం, స్టార్టప్లలో పురోగతిని ముందుకు తీసుకెళ్తూ హైదరాబాద్ ప్రపంచ క్వాంటం హబ్గా మారడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు డిప్యూటీ సీఎం. అత్యంత ప్రతిష్టాత్మకంగా 5 వేల మందికి పైగా పాల్గొనేలా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందన్నారు.
ఇందులో భాగంగా హైదరాబాద్ కు తలమానికంగా కాబోయే భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఆయనతో పాటు నీతి ఆయోగ్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి బీవీఆర్ సుబ్రమణ్యం , సాంకేతిక నిపుణులు, క్వాంటమ్ పరిశోధకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. టెక్నాలజీ, ఫార్మా, లాజిస్టింగ్ తదితర రంగాలలో తెలంగాణ దూసుకు పోతోందన్నారు. దేశంలోనే టాప్ లో కొనసాగుతోందని చెప్పారు.
